ఢిల్లీకి ఉత్తమ్
ప్రాజెక్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జలవివాదాలు, పెండింగ్ అనుమతుల అంశాలపై చర్చించేందుకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోపాటు సంబంధిత అధికారులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జలవివాదాలు, పెండింగ్ అనుమ తులు వంటి అంశాలపై చర్చించనున్నారు.
రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి అవసరమైన అనుమతులు త్వరగా ఇవ్వాలని ఉత్తమ్కుమార్రెడ్డి కోరనున్నారు. కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర నిధుల మంజూరు విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో ఉన్న నీటి పంపిణీ సమస్యల పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేసే అవకాశముంది.
ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత, నీటివినియోగ సమన్వయం వంటి అంశాలపై కేంద్రంతో సమీక్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి కీలకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికలు, కేంద్ర-, రాష్ట్ర సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తంగా, తెలంగాణకు సంబంధిం చిన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, జలవివాదాల పరిష్కారం, నిధుల మంజూరు వంటి కీలక అంశాలపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకురావడమే ఈ ఢిల్లీ పర్యటన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.




