20-06-2025 08:32:50 PM
భద్రాచలం (విజయక్రాంతి): అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు రాబోయే తరానికి తెలిసే విధంగా ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం(Tribal Museum)ను సందర్శకులు కుటుంబ సభ్యులు, పాఠశాలల బాల బాలికలు ఉపాధ్యాయులతో కలిసి మ్యూజియంలోని కళాఖండాలు తిలకించి గిరిజన వంటకాలను ఆస్వాదిస్తున్నారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శుక్రవారం ట్రైబల్ మ్యూజియంను పక్క జిల్లాల నుంచి సందర్శకులు కుటుంబ సభ్యులతో వచ్చే వారి పిల్లల యొక్క పుట్టినరోజు వేడుకలు పాఠశాలల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా ట్రైబల్ మ్యూజియం దర్శించుకున్నారని మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, మాధవి ద్వారా ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా మినిమం చార్జీతో మ్యూజియం సందర్శనకు అనుమతి ఇచ్చినందున శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు 150 మంది పర్ణశాల వెళ్లి సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అనంతరం ట్రైబల్ మ్యూజియంలోని కళాఖండాలను తిలకించి పులకించిపోయారన్నారు. ప్రతిరోజు మ్యూజియం ప్రాంగణంలో పుట్టినరోజుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని, యువతీ, యువకులు, పెద్దలతో మొదలుకొని అందరూ మ్యూజియం ప్రాంగణంలోని పాత ఇండ్లు, సెల్ఫీ పాయింటు, ప్రాంగణం ముందు ప్రతి ఒక్కరూ సెల్ఫీ ఫోటోలు తీసుకొని ఆనందిస్తున్నారన్నారు.
ప్రాంగణం ముందు చిన్నపిల్లల కోసం ఏర్పాటుచేసిన వివిధ రకాల క్రీడలను పిల్లలు ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారని, సరదాగా బోటింగ్ చేసే పిల్లల ఆనందానికి అవధులు లేవని అన్నారు. బాక్స్ క్రికెట్ ఆడే పిల్లలకు సమయం సరిపోవడం లేదని, ఉదయం నుంచే బాక్స్ క్రికెట్ ఆడడానికి పిల్లలు ఉత్సాహం చూపెడుతూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారని, ఉదయం 10 గంటల నుండే మ్యూజియం ప్రాంగణమంతా సందర్శకుల రాకతో సందడిగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, మాధవి, మణి కుమారి, పాఠశాల హెచ్ఎం నీరజ, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.