25-06-2025 01:13:45 AM
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్
సూర్యాపేట, జూన్ 24 (విజయక్రాంతి) : దేశంలో మనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తున్నదే బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లని డోర్నకల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివాసి బునియాది కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ లు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించే విధానాన్ని అవలంబిస్తున్నాయన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తుందన్నారు. దళితులకు, మైనార్టీలకు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీలోనే రక్షణ లభిస్తుందన్నారు. ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకొని వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతం అని ఇందిరాగాంధీ గరీబి హటావో నినాదంతో పాటుగా భూసంస్కరణ చట్టం తీసుకువచ్చి లక్షలాది ఎకరాలని పేదలకు పంచారన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టము, భూసేకరణ నియంత్రణ చట్టం లాంటి చట్టాలను తీసుకొని వచ్చి పేదలకు రక్షణ కల్పించారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ జయంతిని ప్రభుత్వ సెలవుగా గుర్తించిందన్నారు. రాష్ట్రంలో ట్రైకార్ చైర్మన్ తో పాటు కార్యదర్శిని, సింగరేణి ఎండిగా ఎస్టీకి చెందిన వ్యక్తులను నియమించారన్నారు. ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలని అందుకోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ భూక్యా కోటియా నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రామ్ ఇంచార్జీ లింగం నాయక్, పలువురు బంజారా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతితులు, నాయకులు పాల్గొన్నారు.