calender_icon.png 25 June, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమా?

25-06-2025 01:13:33 AM

  1. ఒకరోజు గోదావరి జలాలు, రెండో రోజు కృష్ణాజలాలపై చర్చిద్దాం
  2. గతంలో మీరు సంతకాలు చేసిన కాగితాలన్నీ అసెంబ్లీ ముందుంచుతా
  3. చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా?
  4. రైతు సెంటిమెంట్‌తో మీరు వేల కోట్లకు అధిపతులయ్యారు.. 
  5. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పుమిగిల్చారు.. 
  6. రైతునేస్తం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాం తి): ‘గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చకు పెడదాం, స్పీకర్‌కు లేఖ రాస్తే మీరు చెప్పిన తారీఖున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్‌బాబు తీసుకుంటారు.. చర్చకు ప్రతిపక్షనేత కేసీఆర్ సిద్ధ మా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఒకరోజు గోదావరి జలాలు, రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దామని, గతం లో సంతకాలు చేసిన కాగితాలు అసెంబ్లీ ముందు ఉంచుతానని పేర్కొన్నారు.

‘ప్రజలకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఆలోచ న చేయాలి..అంచనా కట్టండి.. బేరీజు వేయండి.. పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉం దో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టండి..’ అని పిలుపునిచ్చారు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని, ప్రాజెక్టు కూలిపోయినందుకు బీఆర్‌ఎస్ నేతలను కాళేశ్వరంలో నే ఉరితీసినా తప్పులేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా అని సీఎం రేవంత్ నిలదీశారు.

రైతుభరోసా విజయవంతమైన సందర్భంగా  మంగళవారం హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర గల రాజీవ్‌గాంధీ విగ్రహం దగ్గర రైతునేస్తం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని, తాను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని అన్నారు.

సోనియమ్మకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కేసీ ఆర్‌ది అయితే తెలంగాణలో ప్రజా ప్రభు త్వం తేవాలని చంద్రబాబును కాదని కాం గ్రెస్‌లో చేరి ప్రజలతో కదం కదం కలిపానన్నారు. రైతుల పేరుతో అప్పులు చేశా రని, దోపిడీ చేశారని, రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్‌ను ఆదాయవనరుగా మార్చుకుని వేల కోట్లు సంపాదించుకున్నారు..

తెలంగాణ రాష్ర్టం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు ఫామ్‌హౌస్, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చా యి..? మీరు వేల కోట్ల అధిపతులయ్యారు.. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యింది..’ అని ప్రశ్నించారు. పదేళ్లలో ని జాం నవాబుల కంటే ధనవంతులయ్యారని, కానీ ధనిక రాష్ర్టమైన తెలంగాణ దివాళా తీసిందని సీఎం మండిపడ్డారు. 

60వేల ఉద్యోగాలు ఇచ్చాం..

పదేళ్లు వాళ్లు చేయలేనిది తాము మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, లెక్కబెట్టుకుంటామంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూ పిస్తా అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించారని, వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయిం దన్నారు. రూ.300కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, రూ.200కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.

రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయిందని, దేవాదుల పూర్తిచేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి అని చెప్పారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న కేసీఆర్ పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని నిలదీశారు. ఈ దుర్మార్గానికి మీరు, మీ కుటుంబం కారణం కాదా అని సీఎం అన్నారు. లక్ష కోట్లు దోచుకొని, వేల ఎకరాలు ఆక్రమించుకొని బనకచర్ల విషయంలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

మా మొదటి ప్రాధాన్యం రైతులే..

సచివాలయం సాక్షిగా రాష్ర్టంలో 70 లక్షల మంది రైతులు నేడు పండుగ చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్నవయసులోనే తెలంగాణ రాష్ట్రానికి తాను సీఎంగా బాధ్యతలు చేపట్టానన్నారు. ప్రజాప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యం రైతులని, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని సీఎం చెప్పారు.

నాడు కేసీఆర్ రైతుబంధు ఎగ్గొడితే తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. గత పాలకులు వడ్లు కొనమని మాట్లాడారని, కానీ ప్రజా ప్రభుత్వంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామన్నారు. కేసీఆర్ రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి తమకు అప్పంచారన్నారు. మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు మీరేం చేశారని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నాడు రైతుభరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మారని, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్‌రింగ్‌రోడ్డును తెగనమ్మారని, రైతుల పేరుతో అప్పులు చేశారన్నారు.

18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతుప్రభుత్వం తమదని, రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజాపాలన మాదని సీఎం చెప్పారు. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహి స్తున్నామన్నారు.  

వ్యవసాయం అంటేనే కాంగ్రెస్: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

వ్యవసాయం అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క  చెప్పారు. దేశంలో బహుళార్థక సార్థక ప్రాజెక్టులు నిర్మించింది, రైతుల కోసం ఉచిత కరెంటు, రైతులు పండించే పంటకు మద్దతు ధర, బ్యాంకులు తప్పనిసరిగా రైతులకు రుణాలు ఇవ్వాలన్న నిబంధన పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఇందిరమ్మరాజ్యం లో ప్రజాప్రభుత్వ క్యాబినెట్ సమష్టి నిర్ణయంతో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు జమ చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం: మంత్రి తుమ్మల 

కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతునేస్తం సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల రైతు కుటుంబాలకు 21 వేల కోట్లను 2 లక్షల వరకు రుణమాఫీ కోసం వారి ఖాతాల్లో వేశామన్నారు. రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా బీఆర్‌ఎస్, బీజేపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.