25-06-2025 01:15:05 AM
భద్రాచలం, జూన్ 24(విజయ క్రాంతి)ఓట్ల కోసం అనునిత్యం రామ నామ జపం చేసే బిజెపి పోలవరం నిర్మాణానికి నిధులను విడుదల చేస్తూ శ్రీరాముని గుడిని భద్రాచలం పట్టణాన్ని గోదావరిలో ముంచే పాపానికి ఒడిగడుతుందని సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ఆరోపించారు. మంగళవారం సిపిఐ ఎం భద్రాచలం పట్టణ స్థాయి రాజకీయ రెండవ రోజు శిక్షణా తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దేశంలో బిజెపి నాయకత్వంలో ఎన్ డి ఏ మూడోసారి అధికారం చేపట్టాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని, ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలపై సిఐడి, ఈడి తదితర సంస్థలను ప్రయోగించి బెదిరిస్తుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సలైట్లు పేరుతో జైలకు తరలిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆం ధ్రాలో కలిపి భద్రాచలం ప్రాంతానికి బిజెపి ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందన్నారు.
పోలవరం పూర్తి అయితే బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముప్పు తప్పదని ఇంజనీర్ల బృందం స్పష్టం చేసినప్పటికీ నివారణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు.భద్రాచలం అభి వృద్ధికి ముడిపడి ఉన్న ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపడానికి కూడా ఆసక్తి చూడ టం లేదని భద్రాచలం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిందేనని అన్నారు. భద్రాచలం పట్టణ సమస్యలపై పార్టీ వార్డు కమిటీల ఆధ్వర్యంలో అధ్యయనం చేసి పరిష్కారానికి దశల వారి పోరాటాలను రూపొందిస్తున్నామన్నారు.
రెండో రోజు మధ్యాహ్నం సోషల్ మీడియా ప్రాధాన్యతను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ వివరించారు. రాజకీయ శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ గా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి బాధ్యత వహించగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట్రామారావు పారిల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, ఎన్ నాగరాజు, జీవనజ్యోతి తదితరులు పాల్గొన్నారు.