05-02-2026 12:00:00 AM
రూ.184 కోట్లతో చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం
షాద్నగర్ ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పట్టణంలో అభివృద్ధి విషయంలో స్వర్ణ యుగం మొదలైందని, మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
బుధవారం పట్టణంలోనీ 18వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాలనీలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాలనీవాసులతో ప్రత్యేకంగా కలుసుకొని కాంగ్రెస్ అభ్యర్థి జమాల్పూర్ సంతోషి భాయి చందులాల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించి తలపిస్తున్నాయని పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జోరు కనిపిస్తుందని అన్నారు. 184 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా బ్రిడ్జి నిర్మాణం రూపొందించామని తెలిపారు. అభ్యర్థి సంతోషి బాయ్ కోరిన విధంగా షిమ్లా కాలనీలో అనేక అభివృద్ధి పనులు ఇంకా చెప్పటాల్సి ఉందని ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు పనులు నిలిపివేశారని ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..
సంతోషి బాయిని భారీ మెజార్టీతో గెలిపించండి.. అంటూ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఓటర్లను కోరారు. శ్రీనగర్ కాలనీ భాగ్యనగర్ కాలనీలలో చేపట్టిన ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. 18 వ వార్డులో భారీ స్పందన చూస్తుంటే పట్టణంలోని అత్యధిక మెజార్టీ వచ్చే వార్డు ఇదని తెలిపారు. మున్సిపల్ పీఠం హస్తగతం కావడంలో ఎలాంటి సందేహం లేదని ప్రతాపరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, సుదర్శన్ గౌడ్,బస్వం తదితరులు హాజరయ్యారు.