13-11-2025 12:59:09 AM
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): ఓటరు జాబితా సవరింపు ప్రక్రియలో బూతు లెవెల్ ఏజెంట్లను నియమించాలని పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ కోరారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రీవిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (SIR) కార్యక్రమం, ఓటర్ అవేర్నెస్ , ఎథికల్ ఓటింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల ను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని కోరారు.ఓటరు జాబితా సవరింపు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, తప్పులు లేకుండా సవరించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయం చేయాలని సూచించారు.
అలాగే ఓటర్లలో అవగాహన కల్పించేందుకు, ఓటు హక్కు పవిత్రతను కాపాడేందుకు, ఎథికల్ ఓటింగ్ పై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువత, మహిళలు, కొత్తగా అర్హత పొందిన ఓటర్లు ఎన్నికల జాబితాలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.