13-11-2025 01:00:14 AM
జుక్కల్, నవంబర్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మైభాపుర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, బిజ్జల్వాడి గ్రామంలో రూ. 29 లక్షల నిధులతో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపనలు చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
జుక్కల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, త్రాగునీరు వంటి మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించడమే గాక విద్యా, వైద్య వ్యవస్థలను మెరుగుపరుస్తానని చెప్పారు. గత పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంత్ షిండే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (CMRF చెక్కులు) అందజేశారు.