బ్రీత్ ఈజీ.. రన్ ఫ్రీ
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసమే మెడికవర్ కార్యక్రమం
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవనశైలి, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా మెడికవర్ ఆసుపత్రి, హెచ్ఐ టెక్ సిటీ పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘బ్రీత్ ఈజీ, రన్ ఫ్రీ’ 5కెను నిర్వహించింది. ఈ రన్లో వైద్యులు, సిబ్బంది, ఫిట్నెస్, సాధారణ ప్రజలు 250మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ హరిరాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత లంగ్ స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యం, జీవనశైలి మార్పులు ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇటువంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు.
డాక్టర్ రఘుకాంత్ మాట్లాడుతూ.. సాధారణంగా కనిపించే జలుబు, దగ్గు కూడా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. వీటిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. డాక్టర్ రాజ మనోహర్ మాట్లాడుతూ.. చిన్నరుగ్మతలను ప్రారంభదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమై సంక్లిష్టతలు తగ్గుతాయన్నారు. ప్రజలు శ్వాస ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ మేఘన సుభాష్ స్పష్టం చేశారు.






