calender_icon.png 23 June, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక వనరులను ఉపయోగించే ఇటుకల తయారీ

23-06-2025 01:23:24 AM

స్ఫూర్తి నిచ్చిన ‘సండే బ్రిక్స్ ఛాలెంజ్‘..

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 22 (విజయక్రాంతి) స్థానిక వనరులను వినియోగించుకొంటూ, తక్కువ ఖర్చుతో ఇటుకలు తయారు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి భంగం వాటిల్లదని, ఈ ఇటుకలతో నిర్మించిన కట్టడాలకు ప్లాస్టింగ్ అవసరం ఉండదని కలెక్టర్ జితేష్ వే పాటిల్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో ‘సండే బ్రిక్స్ ఛాలెంజ్‘కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలల్లో స్ఫూర్తిని నింపిందన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఎస్ ఏ బి బ్రిక్స్ రూపకర్త, బెంగళూరుకు చెందిన సుధాకర్ రెడ్డి సాంకేతిక నిపుణుల సలహాల కనుగుణంగా బ్రిక్స్ చాలెంజ్ లో 168 మంది ప్రజలు పాల్గొని ఏడు మిషన్ల ద్వారా 300కు పైగా ఇటుకలను తయారు చేసారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీ షర్టు, క్యాప్ లను జిల్లా కలెక్టర్ అందించారు.

అనంతరం వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన 300 మంది ఉద్యోగులు, స్వయం సహాయక బృందాల వారికి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యాశాలను నిర్వహించి సి ఎస్ ఏ బి ఇటుకల తయారీ విధానం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈ ఇటుకల తయారీకి కావలసిన మట్టి, ఇసుక, సున్నం, సిమెంట్, నీళ్లను ఏఏ నిష్పత్తిలో ఎలా కలపాలో, ఈ కలిపిన మిశ్రమాన్ని మిషన్ ద్వారా ఇటుకలుగా ఎలా తయారు చేయవచ్చు సవివరంగా వివరించారు.

అనంతరం పాల్గొన్న ఉద్యోగులు స్వయం సహాయక బృందాల వారు ప్రయో గాత్మకంగా కొన్ని ఇటుకలను తయారు చేసి చూపించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇటుకలు మన దగ్గరలో ఉన్న వనరులను ఉపయోగించుకుని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా తయారు చేసుకోవచ్చు అని, వీటి తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని, ఇలా తయారైన ఇటుకలతో చేపట్టే నిర్మాణాలకు ప్లాస్టరింగ్ కూడా చేయవలసిన అవసరం లేదని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రయోగాత్మకంగా చేపట్టి తద్వారా తయారైన ఇటుకలతో అవసరమైన అన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు, వంట గదులు, మూత్రశాలలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ సహకరించిన జిల్లా అధికారులకు, పాల్గొన్న ఉద్యోగులకు, స్వయం సహాయక బృందాల వారికి, కొత్తగూడెం మున్సిపాలిటీ వారికి, మెప్మా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్కే సైదులు, ఏ నాగరాజు శేఖర్, కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డి ఆర్ డి ఏ అధికారులు, మెప్మా అధికారులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.