calender_icon.png 4 June, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విఫలం

02-06-2025 11:58:26 PM

మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధి..

హరీశ్‌రావుతో నేనెందుకు భేటీ అవుతా: ఎంపీ ఈటల

హైదరాబాద్ (విజయక్రాంతి): ఉద్యమ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడమని, తెలంగాణ వస్తే ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల సుడిగుండంలోకి నెట్టేసిందన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా.. జనాభా తక్కువే అయినా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండేదని.. ఇయాళ కనీసం అప్పు పుట్టకుండా, రాష్ట్రాన్ని తిరోగమన దిశలోకి నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే జీడీపీలో ఎంతో వెనకబడిన ఏపీ.. ప్రధాని నరేంద్రమోదీ అండతో అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. అయితే తెలంగాణకు మరింతగా దూసుకెళ్లే సామర్థ్యం ఉందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. హరీశ్‌రావు తాను భేటీ అయ్యానని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులతో కలవాల్సిన దుస్థితి తామకేం పట్టలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్  కలిసిపోయి, బయటకు మాత్రం నటిస్తున్నాయని ఆరోపించారు.