18న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు
- సీఎం పర్యటనకు ముందే ఆసక్తికర రాజకీయం
- కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యారేజ్ పునరుద్దరణ నేపథ్యంలో రాజకీయం ఆసక్తికరంగా మారనున్నది. ఈ నెల 18న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతలు మేడిగడ్డ బారేజ్ను సందర్శించనుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్పై వివాదాలు, ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యం లో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
బీఆర్ఎస్ నేతలు బ్యారేజ్ నిర్మాణం, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించడంతో పాటు, ప్రభు త్వం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేలా వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేయను న్నారు. ముఖ్యంగా కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహంతోనే ఈ టూర్ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు టూర్ మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎం పర్యటనలో ప్రాజెక్ట్ లోపాలు, నాణ్యత సమస్యలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముండటంతో, ముందుగానే తమ వాదనను ప్రజల ముందు ఉంచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ పర్యటనతో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ రాజకీయ కేంద్రంగా రాబోయే రోజుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.






