2 May, 2026 | 6:28 AM

బీఆర్‌ఎస్ వార్షికోత్సవ సంబురాలు

28-04-2024 12:52 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు హైదరాబాద్ వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీహెచ్‌ఎసీ పరిధిలోని నియోజకవర్గాలు, డివిజన్లతోపాటు నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల వ్యాప్తంగా ఆ పార్టీ గులాబీ జెండాలను వాడవాడలా ఎగుర వేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు, డివిజన్ కార్పొరేటర్లు, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని గులాబీ జెండాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి అణిచివేత, అవమానాలకు గురైన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా మాజీ సీఎం కేసీఆర్ నిలబెట్టారని గుర్తు చేశారు.

రాష్ట్ర సాధనలో ప్రజలను భాగస్వాములను చేయడంలో కేసీఆర్ పాత్ర ఎనలేనిదన్నారు. పోరాట క్రమంలో అరెస్టులు, కేసులు, జైళ్లు, నిర్బంధాలను అధిగమించి 60 ఏళ్ల ప్రజల స్వరాష్ట్ర కలను నిజం చేసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతోందన్నారు. చంపాపేట డివిజన్‌లో శనివారం బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైరామల్‌గూడలో బీఆర్‌ఎస్ జెండా ను డివిజన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, సీనియర్ నాయకుడు మధుసూదన్‌రెడ్డి ఆవిష్క రించారు. బీఆర్‌ఎస్ ఏర్పాటుతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు.