15-11-2025 12:00:00 AM
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
మెదక్, నవంబర్ 14(విజయక్రాంతి):యువతరంతోనే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మెదక్ లో జిల్లా యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలను నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ మెదక్ పట్టణ పుర వీధులు మార్మోగాయి. ర్యాలీ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై రాందాస్ చౌరస్తాలో ముగిసింది. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
రాష్ట్రీయ ఏక్తా దివస్ లో భాగంగా విద్యార్థులతో దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడంలో తాము భాగస్వాములవుతామని ఏకతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రము తర్వాత 565 సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసిన సమైక్యతవాది, మానవతావాది అని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలు భారత యూనియన్ లో కలిసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ ప్రగతికి కృషి చేయాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా యువజన క్రీడలు నిర్వహణ అధికార రంజిత్ రెడ్డి, డిఐఎస్ఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.