31-05-2025 02:12:38 AM
భువనేశ్వర్, మే 30: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ నివాస ంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ దాడి జరుగుతుందని ముందే సమాచారం అందడం తో సదరు ఉన్నతాధికారి ఏం చేయాలో తెలియక 500 నోట్లను కిటికీ నుంచి బయటకు విసరడం కలకలం రేపింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠ నాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. దాంతో విజిలెన్స్ అధికారులు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇంట్లో ఏకకాలంలో దాడులు చేశారు. అయితే తన బాగోతం బయటపడకూడదనుకున్న సారంగి ఆ డబ్బు అధికారలు కంట పడకూడదని తన ఫ్లాట్ కిటికీ నుంచి 500 రూపాయల కట్టలను బయటకు విసిరాడు. ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో కిటికీ నుంచి విసిరిన నగదును అధికారులు రికవరీ చేశారు.
ఈ దాడుల్లో మొత్తం రూ. 2.1 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని అతని ప్లాట్లో రూ. కోటి నగదు స్వాధీనం చేసుకోగా.. మరో రూ. 1.1 కోటి నగదును అతడి బంధువు ఇళ్లలో గుర్తించారు. వీటిని వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే సారంగి నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదులో రూ. 500 నోట్లు. రూ. 100, రూ.200. రూ. 50 నోట్ల కట్టలే అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇక సారంగి నివాసంలోసోదాలు జరిపిన బృందంలో 26 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది డీఎస్పీలు, 12 మంది ఎస్సైలు, ఆరుగురు ఏఎస్ఐలతో పాటు సిబ్బంది ఉన్నారు.