బద్లాపూర్ లైంగిక దాడి కేసులో స్కూలు యాజమాన్యంపై కేసు
పోక్సో చట్టాల ప్రకారం నమోదు
ముంబై, ఆగస్టు 24: బద్లాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగి క దాడి కేసులో సీనియర్ ఐపీఎస్ ఆర్తి సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృంద (సిట్) అధికారులు విచారణను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు ఓ ఉద్యోగిపై పోక్సో చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు గురువా రం విచారణలో జాప్యంపై బద్లాపూర్ పోలీసులను మందలించింది. నేరం జరిగిన వెంటనే స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
షిండే.. ఫడ్నవీస్ కంస మామలు !
‘ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పిల్లల పాలిట కంస మామలు. మహారాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వేడుక చూస్తున్నది’ అని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. బద్లాపూర్ లైంగిక దాడికి నిరసనగా మహా వికాస్ అఘాడీ ఆధ్వర్యంలో శనివారం దక్షిణ ముంబైలోని దాదర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
లైంగికదాడి ఘటనలో నిందితులకు రాష్ట్రప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘మేం రాజ్యాంగ బద్ధంగా నిరసన గళం వినిపిస్తున్నాం. మహిళలు, బాలికల భద్రతకు మహా వికాస్ అఘాడీ ప్రాధాన్యం ఇస్తుంది’ అని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, సాధారణ పౌరులు పాల్గొన్నారు.






