6 July, 2026 | 3:13 AM

మెటాకు కేంద్రం నోటీసులు

06-07-2026 02:11 AM

చిన్నారుల లైంగిక వేధింపుల యాడ్స్ ప్రమోటివ్‌పై గుస్సా

ఏడురోజుల్లో జవాబివ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 5: టెలిగ్రామ్ తరువాత ఇప్పుడు మెటాపై కేంద్రం మరోమారు కన్నెర్ర చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ సెక్యువల్ అబ్యూస్‌మెంట్ (సీఎస్‌ఎఎం) ప్రకటనలు వెంటనే నిలిపివేయాలని, దీనిపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే ప్రకటనలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాగా కేంద్రం నోటీసులపై మోటా ప్రతినిధి స్పందిస్తూ ప్రకటనలతో సహా, సీఎస్‌ఎఎం పంచుకోవడం పట్ల తమ కంపెనీ ‘జీరో టాలరెన్స్ పాలసీ’ పాటిస్తుందని తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్, వ్యక్తులను ముందుగానే గుర్తించేందుకు ఆధునాతన ఏఐ సాంకేతికతను వాడుతున్నామని, నేరగాళ్లను, వారిని ప్రోత్సహించే విధానాలను సహించబోమన్నారు. తమ నిపుణుల బృందం ఇలాంటి కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తుందని, వేధింపులకు పాల్పడేవారి కంటెంట్‌ను వెంటనే నిలిపివేస్తున్నామని తెలిపారు. కాగా భారతదేశంలో బాలికల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలను ఇన్‌స్టాగ్రామ్ నడుపుతోందని ఓ ప్రముఖ చానల్ దర్యాప్తులో తేలడంతో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.కాగా కేంద్రం మోటాకు నోటీసులివ్వడం ఇది రెండోసారి. ఫోన్ నెంబర్లకు బదులుగా యూజర్ నేమ్‌ల ద్వారా కనెక్ట్ అయ్యే సామర్థ్యంపై సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం తొలిసారి నోటీసులు జారీ చేసింది.