20-02-2026 02:10:20 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): చేవెళ్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు.
చేవెళ్ల మాజీ ఎంపీపీ మల్గారి విజయభాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, మరియు నత్తి కృష్ణా రెడ్డిల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అన్నదానం అన్నిటికంటే మిన్న అని, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం గొప్ప మానవతా దృక్పథమని కొనియాడారు.
ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా చేవెళ్ల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆమె గుర్తు చేశారు. పుష్కరిణి ప్రాంగణంలో భక్తులకు అన్నదాన సేవలు అందిస్తున్న మల్గారి విజయభాస్కర్ రెడ్డి, మిట్ట రంగారెడ్డి, పెద్దొళ్ళ ప్రభాకర్ తదితరులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.