01-02-2026 03:07:49 PM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఇటీవల గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన 23 ఏళ్ల మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సౌమ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎంతో పాటు తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క మృతురాలి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిజామాబాద్కు గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారని, జనవరి 23న మాధవ నగర్ సమీపంలో ఒక కారును పోలీసులు అడ్డగించారు. వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగ్లర్ల కారు కింద పడి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. తొలుత స్థానిక ఆసుపత్రిలో చేర్చిన ఆమెను పరిస్థితి సీరియస్ గా ఉండడంతో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)కు తరలించారు. అక్కడ ఆమె శనివారం రాత్రి చికిత్స పొందుతూ మరణించారు.
వివిధ విభాగాల నిపుణులతో కూడిన వైద్య బృందం బాధితురాలిని బ్రతికించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండాపోయింది. జనవరి 31న రాత్రి 9.41 గంటలకు ఆమె మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. గంజాయితో పారిపోతున్న స్మగ్లర్ల కారు ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. సంఘటనా స్థలంలో ఇద్దరు నిందితులను పట్టుకొని, వాహనం నుండి సుమారు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.