calender_icon.png 1 May, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్షక, కార్మిక లోకానికి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు

01-05-2025 08:29:36 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కార్మికలోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తిలో భాగమై జాతి సంపదను సృష్టిస్తున్న సబ్బండ కులాల శ్రామికులు, పరిశ్రమలు తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల రెక్కల కష్టానికి వెలకట్టలేమని, వారి త్యాగం అసామాన్యమైనదని కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని కార్మిక, శ్రామిక, కర్షక లోకాలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. మేడే స్పూర్తితో రాష్ట్రంలోని శ్రామికుల హక్కులను కాపాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసా కల్పించాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలను అమలు చేసి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.

లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని కేసీఆర్ సూచించారు. ఉత్పత్తి, సేవా రంగాల్లో పాల్గొనే మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, హక్కులు కల్పించి అండగా నిలిచామని గుర్తుచేశారు. సింగరేణి, ఆటోడ్రైవర్లు, పలు పరిశ్రమలు సహా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు అన్ని రకాలుగా భరోసా కల్పించామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక వర్గ అనుకూల విధానాలను మరింత బలోపేతం చేయడం ద్వారా, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారా మాత్రమే మేడే స్పూర్తికి, ప్రపంచ కార్మిక లోక త్యాగాలకు మనం అందించే ఘన నివాళి అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.