19-06-2025 07:50:16 PM
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Union Minister Manohar Lal Khattar)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-2 అవసరం ఎంతో ఉందని సీఎం రేవంత్ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరంగా తెలియజేశారు. గురువారం ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రూ. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు.
మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.