19 May, 2026 | 7:32 AM

రైతుకు బేడీలు వేయడంపై సీఎం సీరియస్

12-12-2024 03:49 PM

హైదరాబాద్: లగచర్ల రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతుకు బేడీల ఘటనపై అధికారులను సీఎం ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులకు రేవంత్ రెడ్డి చివాట్లు పెట్టారు. ఘటనపై  విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం రాత్రి సంగారెడ్డి జైలులో హీర్యా నాయక్‌కు ఛాతి నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం మరో అనుమానాస్పద గుండెపోటు రావడంతో, నాయక్‌ను అంబులెన్స్‌కు బదులుగా పోలీసు వాహనంలో, చేతికి సంకెళ్లు, గొలుసులతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతును బేడీలతో ఆసుపత్రికి తరలించడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.