20-05-2025 07:42:44 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రఖ్యాత ఖగోళ, సైన్స్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్త పద్మ విభూషణ్ డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (87) మంగళవారం మహారాష్ట్ర పూణేలో తుది శ్వాస విడిచారు. భారతదేశపు అత్యంత ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రపంచ శాస్త్రీయ సమాజంలో ఒక మహోన్నత వ్యక్తి అయిన ప్రొఫెసర్ జయంత్ నార్లికర్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖగోళ భౌతిక శాస్త్రానికి, ముఖ్యంగా విశ్వ శాస్త్ర రంగంలో ప్రొఫెసర్ నార్లికర్ చేసిన అసాధారణ కృషి ఆధునిక శాస్త్రంపై చెరగని ముద్ర వేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆయన మార్గదర్శక కృషి ప్రపంచవ్యాప్తంగా జయంత్ నార్లికర్ కు అపారమైన గౌరవం, గుర్తింపును తెచ్చిపెట్టింది. భారతదేశంలో ఖగోళ శాస్త్, ఖగోళ భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు అంకితమైన ప్రపంచ స్థాయి సంస్థలను స్థాపించడంలో ప్రొఫెసర్ నార్లికర్ కీలక పాత్ర పోషించారు. ఇది తరతరాలుగా శాస్త్రవేత్తలు, పరిశోధకులకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ప్రొఫెసర్ నార్లికర్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.