10-06-2025 01:13:32 PM
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరిపారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైనా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో రెండు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభలకు హాజరయ్యేందుకు తేదీలు ఖరారు చేయాలని ఖర్గే, రాహుల్ గాంధీని( Rahul Gandhi) రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఖర్గే, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి అగ్రనేతలు ఆదేశించారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కాంగ్రెస్ సీఎంలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేస్తుంది.