02-06-2025 06:01:25 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం గౌరవ పురస్కారాలు అందజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభసందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో కోటి రూపాయల నగదు పురస్కారాలను ముఖ్యమంత్రి వారికి అందించారు. డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రముఖులు తొమ్మిది మందికి రేవంత్ రెడ్డి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో తమ కలం, గళంతో ప్రజలను చైతన్య పరిచిన కళాకారులు, సాహితీ ప్రముఖులు అందెశ్రీ, ఎక్కా యాదగిరి రావు, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, దివంగత గూడ అంజయ్య(వారి తరఫున కుమార్తె గూడ దేవనళిని), స్వర్గీయ గద్దర్(వారి తరఫున సతీమణి జి.విమల), విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూమార్తె సుప్రజలు సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారాలను అందుకున్నారు. బండి యాదగిరి కుటుంబ సభ్యులు అందుబాటులోకి రాలేని కారణంగా వారికి ప్రకటించిన పురస్కారం అందజేయలేదు. అలాగే గతంలో ప్రకటించిన కాళోజీ నారాయణ రావు పురస్కారాన్ని ప్రముఖ రచయిత, సాహిత్యకారుడు నలిమెల భాస్కర్ కి అందించారు.