తల్లితండ్రులను కోల్పోయిన దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసట
బాలికకు అన్ని విధాలా అండగా నిలవాలని నిర్మల్ కలెక్టర్కు సీఎం ఆదేశం
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ మహిళా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి(36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తల్లి అంత్యక్రియలు చేసేందుకు సాయం చేయాలంటూ కూతురు భిక్షాటన చేసింది.
గతంలో తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడంతో తల్లి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతితో కుమార్తె దుర్గ(11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు.
బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.






