5 May, 2026 | 3:09 PM

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఎక్స్‌గ్రేషియా పెంపు

02-09-2024 12:57 PM

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టం, కొనసాగుతున్న వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వి.నరేంద్రరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌, డీజీపీ జితేందర్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లలో  కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని వెల్లడించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలన్నారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ రాయాలని తెలిపారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం ఒక్కో జిల్లాకు ముఖ్యమంత్రి రూ.5 కోట్ల నిధులు విడుదల చేశారు.