భూసేకరణ పూర్తయ్యాకే ప్రాజెక్టు పనులు ముందుకు.!
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు,(విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజె(Palamuru Rangareddy Project)క్టు పనులు త్వరితగతిన పూర్తి కావాలంటే ముందుగా ప్రాజెక్టు కోసం అవసరమయ్యే భూసేకరణ అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో ఉన్నతస్థాయి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకోవడం కోసం ముందుగా భూసేకరణ పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లదే అందుకు పూర్తి బాధ్యత అన్నారు.
అందుకు అవసరమయ్యే నిధులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. అంతకుముందు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. కోయిల్సాగర్, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, జూరాల డ్యామ్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్-1 పంప్హౌస్ను పరిశీలించారు. ప్రాజెక్టు పనులు, పంప్ హౌస్, సంప్ హౌస్, రిజర్వాయర్ పనులు, ఓపెన్ కెనాల్ వంటి పనుల ఫోటో ఎగ్జిబిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డితో కలిసి పరిశీలించారు.






