15-06-2025 08:23:52 AM
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలని, అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని కోరారు. హైదరాబాద్ హైటెక్స్లో కన్నుల పండుగగా సాగిన ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” ప్రదానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వివిధ కారణాల వల్ల 14 ఏళ్ల క్రితం అవార్డులు ఆగిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అనేలా చేశామన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనేలా ఎదిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానిస్తుందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలకు ఏం కావాలో చెప్పండి ప్రభుత్వం అందిస్తుందన్నారు.
“స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా ఒక పరిశ్రమగా రాణించాలి. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలంటే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి సాధించాలని సీఎం తెలిపారు. సినిమా రంగం అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడుతానని హామీ ఇచ్చారు. అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా వాణిజ్యం నిర్వహించవచ్చని పేర్కొన్నారు. 500 ఫార్చూన్ కంపెనీల్లో 85 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడదలచుకున్నామని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలను గుర్తించడానికి 1964 లో ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించి అప్పటి నుంచి 2014 వరకు నిరాటంకంగా నిర్వహించారు. వివిధ కారణాల చేత 14 ఏళ్ల కిందట ఆగిపోయిన సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్దరించాలని దిల్ రాజు ప్రతిపాదించారు. వాటిని పునరుద్దరించడమే కాకుండా గడిచిన పదేండ్ల కాలంలో ప్రతిభ కనబరిచిన అందరినీ అభినందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకు సహకరించిన సినీ రంగానికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
సినీ పరిశ్రమ అంతర్జాతీయంగా ఎదిగేందుకు ప్రణాళికలను తయారు చేసుకుందాని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గద్దర్ అంటే మాకు స్ఫూర్తి.. ఆ స్ఫూర్తితోనే పోరాటం చేశామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు(Gaddar Filmfare Awards) అందుకున్న అందరినీ అభినందించారు. కళా చైతన్యమే తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిస్తోందని ఆయన చెప్పారు. 2014 నుంచి 2024 వరకు ప్రతి ఏటా ఆయా కేటగిరీల్లో ఎంపికైనా ఉత్తమ చిత్రాలతో పాటు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు. ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీసుకుమార్ కి, నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావుకి, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ కి ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ కి ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.