13-06-2025 11:16:51 AM
ప్రభుత్వానికి నివేదిస్తామన్న శాస్త్రవేత్త, అధికారులు
చేవెళ్ల: చేవెళ్ల మండలం చన్వల్లి, పామెన గ్రామాల్లో హైబ్రిడ్ ‘మీనం’ రకం సీడ్ కారణంగా నష్టపోయిన బజ్జి మిర్చి(Damaged Chilli Crop) పంటను పాతోలజీ శాస్త్రవేత్త, అధికారులు పరిశీలించారు. గురువారం ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి పాతోలజీ శాస్త్రవేత్త వీర సురేష్, జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె. సురేష్, చేవెళ్ల డివిజన్ ఏడీఏ సురేష్, మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్, డివిజన్ ఉద్యాన శాఖ అధికారి కీర్తి కృష్ణ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి.. శాంపిల్స్ సేకరించారు.
నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? నాటి ఎన్నిరోజులైంది...? పంటకు వాడిన ఎరువులు, మందులు..? తదితర వివరాలు కూడా రైతులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మొక్కలు తీసుకెళ్తున్నామని, శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని వారు తెలిపారు. ఫీల్డ్ విజిట్ లో నాగార్జున ఏజెన్సీస్ నర్సరీ నుంచి సునీల్ కుమార్, హైవెజ్ మీనం సీడ్ నుంచి శ్రీకాంత్ తో పాటు బాధిత రైతులు చన్వల్లి మాజీ సర్పంచ్ నర్సిములు, శ్రీకాంత్ రెడ్డి, కొంపల్లి వెంకట రెడ్డి, కుమ్మరి చింటు, మంగళి కృష్ణయ్య, సురిబాబు, కావలి రమేశ్, బాయికాడి నర్సింలు, చిరుమని జైపాల్ రెడ్డి, మనీశ్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.