13-06-2025 11:13:19 AM
ఏఐసీటీఈ చైర్మన్ టి.జి. సీతారం
చేవెళ్ల(శంకర్పల్లి): జాతీయ విద్యావిధానం–2020తో(Education Policy) పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలకు మార్గం సుగమమైందని, నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా అద్భుత ఫలితాలు వచ్చాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(All India Council for Technical Education) ఛైర్మన్ ప్రొఫెసర్ టి.జి. సీతారాం స్పష్టం చేశారు. శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లిలో ఉన్న ఇక్పాయ్ వర్సిటీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు– జాతీయ విద్యా విధానం 2020 అమలులో ఉత్తమ పద్ధతులు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.
ముఖ్య హాజరైన టి.జి. సీతారాం మాట్లాడుతూ.. 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా, ప్రతి విద్యార్థి సామర్థ్యాలను బహుముఖంగా వెలికితీసే లక్ష్యంతో ఎన్ఈపీ రూపొందించబడిందని తెలిపారు. భారత్ను జ్ఞాన సమాజంగా, ప్రపంచంలో సూపర్ పవర్గా మార్చడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోందని, 2047 నాటికి ప్రధానమంత్రి ఆశించినట్లు దేశం జీడీపీలో అగ్రస్థానం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విశిష్ట అతిథిగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎం.డి. వెంకటేష్ వర్చువల్గా మాట్లాడారు.
ఇక్ఫాయ్ వీసీ ప్రొఫెసర్ ఎల్.ఎస్. గణేష్ అధ్యక్షత నిర్వహించిన ఈ సదస్సులో హెచ్సీయూ వీసీ బి.జె.రావు, ఐఐఐటి డైరెక్టర్ బి.ఎస్. మూర్తి, హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ పి.జె. నారాయణ, ఐఐటి తిరుపతి డైరెక్టర్ కె.ఎస్. సత్యనారాయణ, జెఎన్టియు వీసీ టి.ఎస్. కిషన్ కుమార్ రెడ్డి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎమ్. కృష్ణమూర్తి, యుజిసి డిప్యూటీ సెక్రటరీ లెఫ్ట్ నెంట్ కమాండర్ వినోద్ సింగ్ యాదవ్, ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ కె.ఎస్. వేణుగోపాల్, ఇక్ఫాయ్ అకడమిక్ సీనియర్ డైరెక్టర్ ఆర్. ప్రసాద్ ప్రసంగించారు.