13-06-2025 01:27:57 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): భార్యపై కోపాన్ని నాలుగేళ్ల కుమారుడిపై చూపించాడో తండ్రి. మానవత్వం మరిచి కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం(Nagireddypet Mandal) పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్కు నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు శశాంక్, ఏడు నెలల కూతురు ఉన్నారు.
దంపతులు ఇద్దరు తమ పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శాలిపేట గ్రామంలో బోనాల పండుగకు వెళ్లారు. అక్కడ అనిల్ చెల్లె కూతురిని శశాంక్ మెట్లపై నుంచి తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం అనిల్ తన భార్య పిల్లలతో పొల్కంపేటకు వచ్చాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్ తన భార్యను కొట్టాడు. అనంతరం వైద్యం చేయిస్తానని చెప్పి గురువారం అక్షితను పోచారంలోని తల్లిగారింటికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు.
కాగా.. తన కుమారుడిని తీసుకొని వెళ్లిన అనిల్ గ్రామ శివారులో ముక్కు నోరు మూసి చంపేశాడు. అనంతరం ఇంటికి తీసుకు వెళ్లాడు. కాగా.. బాబు అచేతనంగా పడి ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అనిల్ను నిలదీయగా భార్యపై కోపంతో తానే ముక్కు మూసి హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ నాయక్ తెలిపారు.