08-05-2025 07:59:49 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
నిర్మల్: ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ ఇటీవలి కాలంలో అక్కడ హత్యకు గురవడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) భరోసా ఇచ్చారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబరులో ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు కలెక్టర్ను కలిసి తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధితులను ఓదార్చి, వారికి తగిన ధైర్యం చెప్పారు. ప్రేమ్ సాగర్ హత్య చాలా బాధాకరం. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అవసరమైనా అందించేందుకు చర్యలు తీసుకుంటామని, పిల్లల విద్య కోసం అన్ని విధాలా తోడుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో ప్రేమ్ సాగర్ భార్య ప్రమీల, పిల్లలు, తల్లి లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల తదితరులు ఉన్నారు.