20-02-2026 08:55:36 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు గృహ నిర్మాణ, ఆర్ అండ్ బి, మున్సిపల్ శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం హంటర్ రోడ్డు న్యూశాయంపేట, హనుమకొండ అంబేద్కర్ నగర్ లలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
బ్లాక్లుగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించి తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, నీటి సంపులు, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నివాసులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాంకు సంబంధించిన పైప్ లైన్ కు ఆన్ ఆఫ్ పెట్టించాలని ఇండ్లవాసులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అక్కడే ఉన్న ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులను సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించి ఇండ్ల నివాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇళ్ళ సముదాయంలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, జిడబ్ల్యూఎంసి కాజీపేట డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు రాజు, రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.