12 March, 2026 | 12:30 PM

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంను తనిఖీ చేసిన కలెక్టర్

12-03-2026 12:45 AM

స్పెషల్ ఆఫీసర్ సహా ఇరువురికి షోకాజ్ నోటీసులు 

నిజామాబాద్, మార్చి 11(విజయక్రాంతి): నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. నిర్వహణపరమైన లోపాలను గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ కవితతో పాటు, బోధనా విధులలో కొనసాగుతున్న రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బాలికల విద్యాలయాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, విద్యార్థినుల భద్రతకు, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకూడదని అన్నారు. అనంతరం 10వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించి, పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. 

ఏవైనా ఇబ్బం దులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. విద్యార్థినుల కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను కలెక్టర్ పరిశీలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ గురించి బాలికలకు వైద్యులు చక్కగా అవగాహన కల్పించడం పట్ల వారిని కలెక్టర్ అభినందించారు. కాగా, కేజీబీవీ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.