01-12-2024 01:57:03 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యానికి ఆటలే శ్రీరామరక్ష అని జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల సందర్భంగా మొదటి రోజు ఆదివారం కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి రామచంద్ర డిగ్రీ కళాశాల వరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు.
ఉత్సాహంగా సాగిన 2కే రన్ లో కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, నాయకులు, విద్యార్థులు, వాకర్స్, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆటలను ఎదో బహుమతులు కోసమని కాకుండా మనం ఎంతో ఇష్టంతో ఆడుకుంటామని అన్నారు. నాకు బాల్యంలో ఆటల పట్ల అమితాసక్తి ఉండేదని చెప్పారు. ప్రజలకు,యువకులు, విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకే ఈ 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రద్ధ వహించాలని, ఇలాంటి రన్స్ పెట్టడం వల్ల ముఖ్యంగా యువత, వయోవృద్ధులకు అత్యంత సహాయకరంగా ఉంటుందనన్నారు.
ప్రతీ ఒక్కరికి ఉదయం పూట నడక, రన్నింగ్ లాంటివి అవసరమని అన్నారు.. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ 2కే రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, వివిధ అసోసియేషన్ల సభ్యులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.