30-05-2025 11:35:30 PM
జూన్ 3 నుంచి మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
రెవెన్యూ సదస్సులపై సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో భూ భారతి చట్టం కింద ప్రజల నుంచి వచ్చే భూ సమస్యల దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉండవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... ఎలిగేడు మండలం పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసుకొని గ్రామాలలో భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించామని, భూ భారతి చట్టం ప్రకారం వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఎలిగేడు మండలంలో అధికంగా సేత్వార్లో సమస్య ఉందని, వీటిన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. సేత్వార్లో లో విస్తీర్ణం ఎక్కువకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మిగిలిన మండలాల్లో కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు. జూన్ 3 నుంచి జిల్లాలోని మిగిలిన మండలాల వారిగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, రెవెన్యూ సదస్సులు ముగిసే నాటికి సేత్వార్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అన్నారు. సాదా బైనమా కేసులు గతంలో 2020 లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని, గతంలో దరఖాస్తు చేసుకోకుండా కొత్తగా సాదా బైనమా దరఖాస్తులు వస్తే తీసుకోవద్దని స్పష్టం చేశారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తును తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలు స్పష్టంగా తెలియజేయాలని, భూ సమస్యల పరిష్కారం సంబంధించి అధికారులు పూర్తి పారదర్శకంగా చట్టం ప్రకారం నిబంధనల మేరకు పనిచేయాలని ఎక్కడ అక్రమాలకు అవినీతికి పాల్పడడానికి వీలు లేదని, ఎవరైనా అధికారులు అవినీతి చేస్తున్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. తహసిల్దార్ వద్ద పెండింగ్ రేషన్ కార్డు దరఖాస్తులను అర్హత మేరకు పరిష్కరించి లబ్ధిదారులకు మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు.