31-05-2025 12:00:00 AM
- ఈరోజు మిస్ వరల్డ్ ఫైనల్స్
- హైటెక్స్ వేదికగా కార్యక్రమం
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): గత 20 రోజులుగా తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల ఫైనల్స్ శనివారం జరుగనున్నాయి. హైటెక్స్ వేదికగా జరిగే ఫైనల్స్ ద్వారా ప్రపంచ సుందరి ఎవరో తేలిపోనుంది.
72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108 సుందరంగాలు బ్యూటీ విత్ ఏ పర్పస్తో పోటీపడతారు. మిస్వరల్డ్ అంటే కేవ లం అందానికి సంబంధించిన అంశం మా త్రమే కాదు.. సామాజిక బాధ్యత, ప్రతిభ, మోడలింగ్, ఫిట్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, నాయకత్వం ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయిస్తారు.
అన్నింటా తమ సత్తా చాటుతూ మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడతారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొ ని తమ ప్రతిభను చాటడంతో పాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాం తాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా.. నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
మిస్వరల్డ్ హోస్ట్లు వీరే..
మిస్వరల్డ్ విజేత స్టెఫానీ డెల్వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ ఫైనల్స్కు హోస్ట్లుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూసూద్కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు.
ఆయన ఫైనల్స్కు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ ఉన్నారు. మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం మన దేశంలో సోనీ లీవ్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది, కొన్ని దేశాలలో జాతీయ టెలివిజన్లో ప్రసారం అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా www.watchmissworld. com ద్వారా హైడెఫినిషన్లో అందుబాటులో ఉంటుంది.
ఫైనల్స్లో ఎంపిక విధానం
108 మంది పోటీదారులలో ప్రతీ ఖండం (అమెరికా అండ్ కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానియా) నుంచి 10 మంది సెమీఫైనలిస్టులు అంటే మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్కు చేరతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు.
విజేతకు కిరీటం..
మిగిలిన సెమీఫైనలిస్టులను వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జీల ప్యానెల్ ఎంపిక చేస్తుంది. ఈ నిర్ణయాన్ని ఫైనల్ షో సమయంలో వెల్లడిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ తర్వాత ప్రతీ ఖండం నుంచి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, చివరిగా నాలుగు ఖండాల విజేతలు ఎంపికవుతారు.
వీరి నుంచి చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్ ఎన్నికవుతుంది. విజేతకు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్) కిరీటం అందజేస్తారు.
మిల్లా మ్యాగీపై లండన్లో కేసు: స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల వ్యవహారంపై విచారణ పూర్తయిం దని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిల్లా మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది.
మిస్ వరల్డ్ నిర్వాహకులు లండన్ కోర్టులో కేసు వేశారు. ఆమెపై బ్రిటన్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోబోతుంది. తెలంగాణ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టదు’ అని పేర్కొన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగే తేనేటి విందుకు కొత్త మిస్ వరల్డ్ పాల్గొంటారని తెలిపారు.