calender_icon.png 3 June, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగిలింది ఆ ముగ్గురే!

29-04-2025 12:00:00 AM

కాళేశ్వరం అక్రమాలపై కమిషన్ విచారణ 90శాతం పూర్తి

ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, ఎన్జీవోల విచారణ 

అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్, ఈటల విచారణ మాత్రమే పెండింగ్

వీరి విచారణ తర్వాతే తుది నివేదిక?

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఎదుట అధికారులు, కాంట్రాక్టర్లు, సాంకే తిక నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇలా అందరూ విచారణకు హాజరయ్యారు. కానీ ముగ్గురు మాత్రం మిగిలారు. వారే కేసీఆర్,హరీశ్‌రావు,ఈటల రాజేందర్. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయనే డిజైనర్, ఇంజినీర్ అన్నంతగా నిత్యం సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.

బీఆర్‌ఎస్ మొదటి టర్మ్‌లో నీటిపారుదలశాఖ మంత్రిగా, రెండో టర్మ్‌లో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర వహించారు. ఇక ప్రస్తుతం బీజేపీలో ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం కేసీఆర్ సర్కారు రెండోటర్మ్‌లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నా రం బ్యారేజీల డిజైన్లు మార్చి నాసిరకంగా నిర్మించడం వల్ల మూడు పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక స్పష్టం చేసింది. 

రంగంలోకి ఏసీబీ..

ఈ నెల 24 ఎన్డీఎస్‌ఏ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా..నివేదిక వెలువడిన రెండురోజులకే ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టుతో సంబంధంఉన్న ఈఎన్‌సీ హరిరామ్ ఇంటిపై దాడులు చేసి సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి వాటి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో హరిరామ్‌తో పాటు ఇంకా అనేకమంది కీలకమైన అధికారులు పనిచేశారు. వారందరిపై కూడా ఏసీబీ నజర్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న అధికారులతో పాటు ప్రాజెక్టు ఆలోచన, నిర్మాణంపై కీలకంగా ఉన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. 

వీరి విచారణ పూర్తయితే నివేదిక సిద్ధమైనట్లే..

ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల నుంచి తీసుకున్న కీలకమైన పత్రాల ఆధారంగా 400 పేజీల నివేదికను కమిషన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక కూడా అందిన నేపథ్యంలో ఇక ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేసేందుకు మిగిలింది కీలకమైన ఆ ముగ్గురి విచారణే అని తెలుస్తోంది. వీరిని ఓపెన్‌కోర్టుకు విచారణకు పిలిస్తే బందోబస్తు తరహా ఇబ్బందులపైనా కమిషన్ చర్చించినట్లు సమాచారం. అందుకే ఏ విధంగా వీరిని విచారణ జరపాలనే అంశంపై కమిషన్ తర్జనభర్జన పడుతోందని తెలుస్తోంది. అయితే కచ్చితంగా వీరి విచారణ ఉంటుందని సమాచారం.

అధికారులు, కాంట్రాక్టర్ల విచారణ సందర్భంగా పలువురు నేరుగా కేసీఆర్, హరీశ్‌రావు పేర్లను విచారణ కమిషన్‌కు తెలిపారు. వారు చెప్పడం వల్లే డిజైన్లు, లొకేషన్లు మార్చినట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరోసారి పొడగించి..ఆ ముగ్గురిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. విచారణ కోసం నోటీసులు పంపించే సమయంలో కనీసం 15 రోజుల గడువు అయినా ఇస్తారని కూడా అంటున్నారు. మే నెలలో కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ప్రభుత్వం చేతికి అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.