calender_icon.png 21 June, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరులో అన్ని చోట్లా పోటీ

17-06-2025 12:46:23 AM

-బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

-జన, కుల గణనతో నూతన ఒరవడి

-కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరాలి

-కేంద్రమంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : దేశంలో జనగణనతో పాటే కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఈ జనగణన దేశంలో నూతన సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలకు కొత్త ఒరవడిని తెస్తుందన్నారు. సోమవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రతి వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా అనువైన యాప్ రూపకల్పన జరుగుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి బీసీ జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ముందుగానే ప్రకటించి, పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సరైన అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనేలా రాష్ర్ట ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్, కేసీఆర్ కుటుంబం ఒక ఒప్పందం ప్రకారమే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. బనకచర్లపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

స్థానిక సమరంలో అన్ని చోట్లా స్వంతంగా పోటీ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా, సంపూర్ణంగా పాల్గొంటుందని.. అన్ని స్థానాల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీ ణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి వారికి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రకటించిన విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వెయ్యి మంది యువత ముందుకు రావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు 15వ ఫైనాన్స్ ఆధారంగా నిధులు ఇస్తోందని, ఉపాధి హామీ నిధులు కూడా కేంద్రమే ఇస్తోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. 

ఫోన్ ట్యాపింగ్‌పై కోర్టుకు వెళ్లాం..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ తరఫున రాష్ర్ట హైకోర్టుకు కూడా వెళ్లినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలని సుద్దపూసలా మాట్లాడుతూ కేంద్రానికి లేఖలు రాసిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. న్యాయవాదుల ఫోన్లు, అనేక మంది వ్యాపారస్తులు, సినిమా నటులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.

తనతో పాటు బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిగేలా, దోషులకు శిక్షపడేలా సీబీఐ దర్యాప్తునకు రాష్ర్ట న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ బీజేపీ తరఫున పిటిషన్ వేశామన్నారు. అందుకు అనుగుణంగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. 

బనకచర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు..

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పీఎఫ్‌ఆర్ (ప్రీ-ఫీ జిబిలిటీ రిపోర్ట్)ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. బనకచర్లపై తెలంగాణ నుంచి లేవనెత్తిన అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఇచ్చిందన్నారు.

జల ఒప్పందాలపై విధానాలు, నిబంధనలు, నదులపై ఉన్న గైడ్‌లైన్స్ల్, అనేక రాష్ట్రాల అభిప్రాయా లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ సమగ్రంగా పరిశీలన జరుపుతుంద న్నారు. సీడబ్ల్యూసీ  నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ర్ట ప్ర భుత్వం సరైన వాదనలు వినిపించాలని సూచించారు.

దుందుడుకు విధానంతో కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. రెండు రాష్ట్రాలు, వాటి నీటి పంపకాలు, వర ద జలాల విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారం చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎటువంటి సమాచార మార్పిడి జరగలేదని.. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విషయంలో, రాష్ట్రానికి న్యాయం జరగేలా చర్యలు తీసుకునేలా కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాయాలని రాష్ర్ట ముఖ్యమంత్రిని ఇంతకుముందు డిమాండ్ చేశానని.. ఈ విషయంలో ఉత్తరం రాయడంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ద్వారా ఏపీ ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడేలా బాధ్యత తీసుకోవాలని.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతీ అంశంపై బీజేపీని విమర్శించడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. 

కాళేశ్వరంపై ఎప్పుడూ తమది ఒకటే మాట..

కాళేశ్వరం విషయంలో అప్పుడు, ఇప్పుడూ బీజేపీది ఒకే మాట అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దోపిడీ జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరామని.. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి స్టాండ్ ను మార్చుకుందని తాము అలా కాదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు బీజేపీ ఆఫీసులో తయారు చేస్తున్నారనే బీఆర్‌ఎస్ విమర్శలు వాస్తవ విరుద్ధమైనవన్నారు.

బీఆర్‌ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసింది.. 

మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత ముఖ్యమంత్రికి ప్రొఫార్మా పంపినా.. దరఖాస్తు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేసి ఆయా రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని.. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సకాలంలో దరఖాస్తు చేయలేదని తెలిపారు.

ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వలేదంటూ విమర్శిస్తున్నారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలలో, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని.. కనీస వసతులు లేకుండా వైద్య విద్యార్థులకు విద్య ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కనీసం కొత్త కుర్చీలు, బెంచీలు కూడా కొనలేదన్నారు.