17-06-2025 12:36:22 AM
వేములపల్లి జూన్ 1౬(విజయక్రాంతి): భూ కబ్జాదారులు కాల్వకట్టలను సైతం వదిలిపెడతలేరు. రహదారి వెంబడి ఉన్న భూమి కోట్లలో విలువ చేస్తుంది.భూమి విలువ పెరిగిపోవడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. పచ్చారు గడ్డ గ్రామ శివారు వేములపల్లి రెవిన్యూ పరిధిలో ఆదర్శ కాలువ వెళ్తుంది. ఈ కాల్వ కింద కొన్ని వందల ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తుంటారు.
ఆదర్శ కాలువ కు ఇరువైపులా ఉన్న రైతులు కాలువ కట్టను తవ్వి కబ్జా చేస్తున్నారు. రహదారి వెంబడి కాలువ సుమారు 1000 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి ఇరువైపులా కట్టను కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు. కొంతమంది ఫిర్యాదు చేయడంతో శుక్రవారం అధికారులు పర్యవేక్షించారు. కట్టకు కొద్ది దూరం మాత్రమే మట్టి పోసి సరి చేశారు. మిగిలిన కాలువ కట్టను సరి చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ అధికా రులకు కాలువ పొడవు, వెడల్పు, విస్తీర్ణం తెలియదా అని పంట సాగు చేసే రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆదర్శ కాలువ కట్ట ఇరువైపు లా కబ్జాకు గురైంది. కానీ అధికారులు కొద్ది దూరం మాత్రమే కట్టబోసి వెళ్లిపోవడంతో అధికారులకు ముడుపులు అందాయని రైతులు బహిరంగంగానే చర్చించుకుం టున్నారు.
వందల ఎకరాల్లో పంట సాగు
రాబోయే వానాకాలం సీజన్లో వరి సాగు చేయడం కొరకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దూక్కి దున్ని సిద్ధంగా ఉన్నారు. వర్షాలు పడి సాగర్ కాలువ నీళ్లు వదిలితే ఈ ఆదర్శ కాలువ కింద కొన్ని వందల ఎకరాల్లో పంట సాగు అవుతుంది. నీళ్లు వదిలినప్పుడు కట్ట సన్నగా ఉన్న ప్రదేశం లో తెగి ఎక్కడ తమ పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నామ మాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ కాలువ కట్ట ఇరువైపుల కబ్జాకు గురవుతుండడంతో రైతులు ఫిర్యాదు చేశారని ఐడిబిఐ అధికారులు తెలిపారు.
కానీ తనిఖీ చేసిన అధికారులు మాత్రం కాలువ, వెడల్పు, పొడవు విస్తీర్ణం ఏవి గుర్తించకుండానే నామమాత్రపు తనిఖీలు చేసి కొద్ది దూరం కట్టను పోసి వెళ్లిపోయారు. అధికారులు కాలువ ఎంత విస్తీర్ణంలో ఉందో గుర్తించక లేకపోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేసి కాలువ కట్టను నిర్మించాలని రైతులు వేడుకుంటున్నారు.