15-06-2025 12:43:45 AM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రామకృష్ణాపూర్ పట్టణానికి రాగ ఆయనకు పెద్ద ఎత్తున కాంగ్రెస్, సీపీఐ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి గజ మాలతో సత్కరించారు. పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి కూడలి వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి కార్మిక విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రామాలయంలోని అమరవీరుల స్థూపనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రామాలయం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న 76 జీఓ ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని హామీని ఇచ్చారు.పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే రోడ్లు,డ్రైనేజీలు నిర్మించడం జరిగిందన్నారు.పట్టణ వాసుల చిరకాల కోరిక క్యాతన్ పల్లి రైల్వే గేట్ పై వంతెనను నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు.కాగా మంత్రి సభలో కార్మికుల గురించి ఎక్కడ మాట్లాడక పోవడంపై పలువురు సింగరేణి కార్మికులు పలు విమర్శలు చేస్తున్నారు.