కాంగ్రెస్ది అంకెల గారడీ
- ఈ ఏడాది మార్చి జీఎస్టీ వృద్ధి జీరో శాతానికి
- కరోనా తర్వాత ఇంత తక్కువ వృద్ధిరేటు ఎన్నడూ లేదు
- రైతుభరోసా ఇవ్వకపోవడంతో రైతుల కొనుగోలు సామర్థ్యం తగ్గింది
- ‘ఎక్స్’లో హరీశ్రావు విమర్శలు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గణనీయంగా తగ్గిందని మాజీమంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2025 మార్చి నాటికి జీఎస్టీ వృద్ధిరేటు జీరో శాతానికి నమోదైందని మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5.1శాతం మాత్రమే వృద్ధి సాధించినట్లు అధికారిక గణాంకాల ఆధారాలను వెల్లడించారు. దేశవృద్ధి రేటు 10శాతం ఉంటే తెలంగాణ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందన్నారు. అయితే అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క 12.3శాతం వృద్ధి రేటు ఉందని చెప్పడం అవాస్తవమని తేలిపోయిందన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో తాను 5.5శాతమే వృద్ధిరేటు ఉందని హెచ్చరించానని, తమ సలహాలు, హెచ్చరికలు ప్రభుత్వం పట్టించు కోలేదని హరీశ్రావు మండిపడ్డారు. కోవిడ్ కాలంలో తప్పా ఇంత తక్కువ జీఎస్టీ వృద్ధి రేటు తెలంగాణలో ఎప్పు డూ నమోదు కాలేదన్నారు. ఈ పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమన్నారు. రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు సామర్థ్యం తగ్గిందని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత అంకెల గారడీలు మానుకోవాలని, వాస్తవ ఆధారిత పాలన అందించాలని హితువు పలికారు.






