09-04-2025 01:54:31 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అల్ఫోర్స్ విద్యాసంస్థ సహకారంతో వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒలంపియాడ్ లో శిక్షణ ఇప్పించారు.
ఈ పరీక్ష రాసి మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఒలంపియాడ్ లో మెరిట్ సాధించిన 16 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే విధంగా ప్రైవేటు యాజమాన్యాలతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం అన్ని రంగాల్లోనూ రాణించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా అల్ఫోర్స్ విద్యాసంస్థ 400 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఒలంపియాడ్ లో శిక్షణను ఇచ్చిందని తెలిపారు. వీరిలో 80 మంది మెరిట్ సాధించగా 16 మందికి మెడల్స్ వచ్చాయని తెలిపారు. మెరిట్ సాధించిన 80 మంది విద్యార్థులకు ఈనెల 24 నుండి మరో దఫా శిక్షణ ఉంటుందని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, భవిత కేంద్రాల కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.