03-05-2025 05:10:44 PM
ఘనంగా ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం...
మునుగోడు (విజయక్రాంతి): విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఎఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ మునుగోడు మండల కేంద్రంలో యువజన సంఘ జెండాను ఎగురవేసి మాట్లాడారు. మన దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు. యువతరంలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నిరంతరం కృషి సల్పుతున్నదన్నారు.
దేశం కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్వాతంత్ర్యోద్యమంలో, యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసింది, దేశాన్ని పట్టిపీడిస్తున్న తెల్లదొరలను తరిమిందన్నారు. దేశ స్వాతంత్ర్యానంతరం నల్లదొరల దోపిడీని అడ్డుకునేందుకు 1959 మే 3వ తేదీన ఎఐవైఎఫ్ ఆవిర్భవించిందన్నారు. పొత్తిళ్ళలోనే ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొని యువజన హక్కుల సాధనకు సామాజికాభివృద్ధికి పాటుపడుతూ యువజనోద్యమాల వేదికగా ముందుకు సాగిపోతున్నదన్నారు.
AIYF పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దుచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్టును రూపొందించి, అమలు చేయాలని పోరాటం చేస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు పులికరం ఆంజనేయులు, బొలుగూరి వంశీకృష్ణ, ఈదులకంటి కైలాసం, తిరందా శ్రీనివాసులు, సంపంగి కోటి ,తీర్పారి శేఖర్, తాజ్ ,శంకర్ కృష్ణ పాల్గొన్నారు.