06-10-2025 08:35:57 PM
మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు..
బీఆర్ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీ..
హనుమకొండ (విజయక్రాంతి): పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్నారు. పదేళ్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బీఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు.. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది. కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ. మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని.. తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమేనని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది. వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్లు విడుదల చేసిందన్నారు. టీఆర్ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు. పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంచారు. ఎరువుల కొరత, విత్తనాల కొరత.. రైతు దైనందిన కష్టాలు టీఆర్ఎస్ పాలనలో పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది. మార్కెట్లో కనీస మద్దతు ధర హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ 2018లో ఇచ్చిన హామీ.. “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.” పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసిందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది. మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బీఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.