08-02-2026 12:00:00 AM
జీహెచ్ఎంసీ అధికారులు
హయత్ నగర్ - తొర్రూర్ రోడ్డులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఎల్బీనగర్, ఫిబ్రవరి 7: అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలతోపాటు రోడ్డును ఆక్రమించి అడ్డుగా చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హయత్ నగర్ - తోర్రూర్ రోడ్డులో ఫుట్ పాత్ లను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సాయంతో కూల్చి వేయించారు. హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విజయలక్ష్మి, సోమశేఖర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. త్వరలోనే హయత్ నగర్ - తోర్రూర్ రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని తెలిపారు. కూల్చివేతల సమయంలో దుకాణా దారులు అధికారులతో వాగ్వాదానికి దిగా రు. ముందుగా నోటీసులు ఇవ్వకుండా సామగ్రి తీసుకోకుండా అప్పటికప్పుడు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.