23-11-2025 12:57:17 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికే ప్రాముఖ్యత ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన మహిళలకు రంగురంగుల, నాణ్యమైన ఇందిరమ్మ చీరలను నాయకులు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరిట మంజూరు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని నాయకులు వెల్లడించారు. చీరల రంగులు, నాణ్యత చూసి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు చేరేలా చర్యలు తీసుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.