23 May, 2026 | 3:18 AM

మీకు భవిష్యత్ ఉండదనా?

23-05-2026 01:33 AM
  1. ప్యూచర్ సిటీపై ఆ మాటలు  పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకే..
  2. బీఆర్‌ఎస్.. శవంతో సమానం: ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి  

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీమంత్రి హరీష్‌రావు బ్లాక్ మెయిల్ రాజకీయా లు చేస్తున్నారని ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టడమే హరీష్‌రావు ఉద్దేశ మని ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పొర్లు దండాలు పెట్టి నా, మోకాళ్ల యాత్రలు చేసినా, మా సీఎంని తిట్టినా అధికారంలోకి రాదన్నారు. హరీష్‌రావు అమెరికా వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడని లక్షలాది మంది యువత కలలను దెబ్బతీయాలన్నదే హరీష్‌రావు ఆలోచనగా ఉందన్నారు.

అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఫ్యూచర్ సిటీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారని, వారిని అడ్డుకోని తెలంగాణ భవిష్యత్తు గొంతు కోసేలా హరీష్‌రావు తీరు ఉందని యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ శవంతో సమానం. చచ్చిన శవాలను బతికించే మందు ఇప్పటివరకు రాలేదు. బీఆర్‌ఎస్ శవంతో సమానం, ఆ పార్టీ లేవదనే కవిత బయటకు పోయింది. బీఆర్‌ఎస్ పార్టీ కథ ముగిసిందని ప్రజలు తీర్పు ఇచ్చారు’ అని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం ఆయన  సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 800 నుంచి 1,000 ఎకరాల్లో హైదరాబాద్ ఐటీ అంతా విస్తరించి ఉందని, 20 నుంచి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించి 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

యువతలో స్కిల్స్‌ను పెంచడానికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడంతో పాటు స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహారిస్తున్నారని, ఈ బోర్డులో దిగ్గజాలు సభ్యులుగా ఉన్నారని ఆయన వివరించారు. ఫ్యూచ్ సిటీ నిర్మాణం అయితే తమ ఉనికి గల్లంతు అవుతుందని బీఆర్‌ఎస్ భయపడుతోందన్నారు. 

ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ఆయన నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల కుటుంబం యువతను ఆత్మహత్యలకు ప్రేరేపించిందన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడంలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేక గింజుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమకారులకు పదవులు ఇవ్వవని కేసీఆర్.. మళ్లీ  అధికారంలోకి వస్తామని కలలు కంటున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఎంత విషప్రచారం చేసినా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపైనే కంపెనీలకు విశ్వాసం ఉంటుందన్నారు. ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, జీనోమ్ వ్యాలీ లాంటి వాటిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. 

పెట్టుబడులు రావొద్దని చెప్పలేదు.. 

మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు పెట్టబడులు రావొద్దని చెప్పలేదు. కాలుష్యకారక ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఆనాడు చెప్పాం. హరీష్‌రావు ఎంతవరకైనా దిగజారుతానని రుజువు చేసుకున్నాడు. ‘తెలంగాణ యువత దుబాయ్‌కి, ముంబయికి వలస పోవాలని కల్వకుంట్ల కుటుంబం చూస్తోంది. ఫార్మా సిటీలో గ్రీన్ ఫార్మా జోన్‌ను ఏర్పాటు చేస్తున్నాం.. లైఫ్ సైన్స్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. కాలుష్యం లేని ఫార్మా సంస్థల ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నాం.

తెలంగాణ నడిబొడ్డున కాలుష్యం నింపాలని మేం అనుకోవడం లేదు. ఫార్మా కంపెనీలతో డీల్ చేసుకున్నారని అనిపిస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రజలు కాలుష్యం కోరల్లో పడి చనిపోవాలని కోరుకుంటున్నారు. మహానగరాన్ని తయారు చేసుకోవాలని మేం గొప్ప ఆలోచిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బందర్ పోర్టుతో కనెక్టివిటీ ఏర్పాటుచేస్తున్నాం.

పోర్టు కనెక్టివిటీ ఇస్తే అనేక పరిశ్రమలు ఫ్యూచర్ సిటీకి వస్తా యి. రేవంత్‌రెడ్డి ఆలోచనలు సఫలీకృతం అవుతున్నాయన్న దుగ్దతో ఉన్నారు. తెలంగాణ పిల్లల భవిష్యత్తును హత్యచేస్తున్నా రు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీ యం గా బుద్ధిచెప్పి స్థానం లేకుండాచేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.