01-06-2025 12:00:00 AM
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తన లక్ష్యమంటున్నారు కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ విజయ్ మోహన్. ఆయన ఒక వైద్యుడు మాత్రమే కాదు ఎంతోమంది మెడికో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
తన ఇంటినే తరగతి గదిగా మార్చేసి.. భావితరాల డాక్టర్లను సమాజానికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యవిద్యలో రావాల్సిన మార్పులను విజయక్రాంతితో పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
దేశంలో మరిన్ని మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్యవిద్యలో నాణ్యత పెం పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కేవలం థియరీ పరీక్షలతో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించడం కాదు. మెడికల్ ప్రాక్టీస్లోని అనేక అంశాల్లో విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవడం చాలా కీలకం. ఉన్నత ప్రమాణాలతో కూడిన సిలబస్ను అభివృద్ధి చేయాలి. దానిని తప్పనిసరిగా అనుసరించాలి.
విద్యార్థులకు క్లినికల్ ఎక్స్పోజర్ పై దృష్టి సారించాలి. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక (ప్రాక్టికల్) విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అండర్గ్యాడ్యు యేట్ ప్రీక్లినికల్ ట్రైనింగ్ను క్లినికల్ ట్రైనింగ్లో భాగం చేయాలి. వైద్య కళాశాల్లలో స్కిల్ ల్యాబ్లను తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి. వాటిలో విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించాలి.
పుస్తక జ్ఞానం అవసరం
దేశంలో రోజురోజుకు వైద్యవృత్తి దిగజారుతున్నది. మెడికల్ కాలేజీల్లో బోధన ప్రమాణాలు అంతంత మాత్రం. ముఖ్యంగా విద్యార్థులు, అధ్యాపకుల్లో వైద్యవిద్యపై ఆసక్తి తగ్గిందనే చెప్పాలి. గతంలో మా ప్రొఫెసర్ ఒక క్లాస్ చెబితే.. దాన్ని శ్రద్ధగా విని.. రికార్డులు ప్రిపేర్ చేసేవాళ్లం. వైద్యవిద్యను ఇతర సబ్జెక్టులతో పోల్చలేం. మిగతా సబ్జెక్ట్స్ ఆన్లైన్లో క్లాస్లు విని అర్థం చేసుకోవచ్చు.
కానీ వైద్యవిద్య అలా కాదు. కచ్చితంగా రోగి మనముందు ఉండాల్సిందే. రోగిమన ముందు లేకుండా చికిత్స చేస్తే రోగి జీవితంతో ఆడుకున్నట్టు అవుతుంది. మంచి శిక్షణ ఉంటే డాక్టర్ల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది అక్షర సత్యం. ఈతరం విద్యార్థులు ప్రతిదానికి గూగుల్పై.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం పై ఆధారపడుతున్నారు. దాంట్లో సమాచారం కచ్చితంగా ఉంటుందనే నమ్మకం లేదు. మంచి జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదవాల్సిందే.
ఇది మహాసముద్రం
కోవిడ్ సమయంలో చాలామంది వైద్యవిద్యార్థులు బాగా నష్టపోయారు. వైద్యవిద్య.. గణితం లాంటి సబ్జెక్ట్ కాదు. గణితం ఆన్లైన్లో కూడా విని అర్థం చేసుకోవచ్చు. కానీ మెడిసిన్ విద్య అలా కాదు. కచ్చితంగా డాక్టర్ రోగి మీ కళ్ల ముందు ఉండాల్సిందే? రోగితో మాట్లాడాల్సిందే? స్టెతస్కోప్ ఉపయోగించి.. రోగినాడీ స్పందనలను ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి? రోగి ముందు లేకుండా చికిత్స చేయడం సరైన పద్ధతి కాదు.
వైద్యవిద్య జీవితాంతం చదివినా కూడా నేర్చుకునేది ఒక శాతం మాత్రమే. ఇంకా 99 శాతం మిగిలే ఉంటుంది. ఎందుకంటే వైద్యవిద్య అనేది ఒక పెద్ద సముద్రం. వైద్యవిద్యను అభ్యసించడానికి ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి దీన్ని ఒక ప్యాషన్గా ఎంచుకోవాలి.
ఆసక్తి, అంకితభావం తప్పనిసరిగా ఉంటేనే మంచి వైద్యుడు అవ్వగలడు. అలాంటి వారే భవిష్యత్తులో మెరుగైన వైద్యం అందించగలరు. ప్రస్తుతం వైద్యవిద్య బాగా కమర్షియల్గా మారింది. వైద్యవిద్యపై ప్రభుత్వాలు కాస్త చొరవ చూపిస్తే.. బాగుంటుంది.
సరిపడా స్టాఫ్ లేకపోవడం..
ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి ఆరోగ్య రంగానికి కొంత కేటాయించి, అందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నది ప్రభుత్వాల లక్ష్యం. కానీ ఆచరణలోనే ఎన్నో సమస్యలు. ప్రపంచంలో వేలు, లక్షల జనాభా కలిగిన కొన్ని దేశాలు మాత్రమే ఈ సదుపాయాన్ని ఇవ్వగలుగుతున్నాయి. జనాభా 2, 3 కోట్లు దాటితే అమలు కష్టమే. ఇంగ్లండ్ ఫ్రీ హెల్త్కేర్ ఇస్తున్నా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నది.
ధనిక దేశమైన అమెరికా కూడా ఉచిత వైద్యం అందించలేకపోతున్నది. మనదేశంలో అయితే అది సాధ్యమే కాదు. మన ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండే నిధులతో అమలు చేసే పరిస్థితి లేదు. అనేక దేశాలు జీడీపీలో 10 శాతం వరకు ఆరోగ్యరంగానికి కేటాయిస్తున్నాయి. భారత్లో ఇది రెండు శాతానికి మించడం లేదు. మనదేశానికి, ఇతర దేశానికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మనదేశంలో డాక్టర్లు తక్కువగా..
రోగులు ఎక్కువగా ఉంటారు. కానీ విదేశాల్లో మాత్రం.. రోగులు తక్కువగా.. డాక్టర్లు ఎక్కువగా ఉంటారు. తెలంగాణలో ఇంకా పది మెడికల్ కాలేజీలు పెట్టినా తక్కువే. కానీ, ఆస్పత్రిలో సరిపడా స్టాఫ్, ల్యాబ్, ఇతర పరికరాలుఉండాలి.
మనదేశంలో మెడికల్ కాలేజీల్లో సరిపడా స్టాఫ్ లేరు. మెడిసిన్లో 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టుకు కనీసం ఒక ఐదు లేదా ఆరు మంది స్టాఫ్ ఉండాలి. ఒక ప్రొఫెసర్, ఒక అడిషనల్ ప్రొఫెసర్, ఇద్దరు అస్టిసెంట్ ప్రొఫెసర్స్, ఇద్దరు లెక్చరర్స్ ఉంటేనే సరైన బోధన విద్యార్థులకు అందుతుంది.
మంచి పరిణామం
ఒక పరిపూర్ణమైన వైద్యుడు కావాలంటే కనీసం 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఎంబీబీఎస్ కోర్సు ఒక్కటే చదివితే డాక్టర్ కాలేరు. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చేయాలి. ఎండీ చేశాక.. మళ్లీ సూపర్ స్పెషాలిటీ చదవాలి. ఇవన్నీ పూర్తి కావడానికి కనీసం పది ఏళ్లు పూర్తి అవుతుంది. ఇంజినీరింగ్ పూర్తి కాగానే ఎవరికైనా రెండు, మూడేళ్లల్లో జాబ్ దొరుకుతుంది. లైఫ్ సెట్ అవుతుంది.
కానీ డాక్టర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు ముందుగానే పిల్లలను అడుగుతున్నారు.. ‘నువ్వు డాక్టర్ అవుతావా?’ అని. ఇది మంచి పరిణామం. బలవంతంగా పిల్లలను ఈ వృత్తిలోకి నెట్టవద్దని నా అభిప్రాయం. ముఖ్యం గా డాక్టర్స్కు ప్రత్యేకంగా వ్యక్తిగత జీవితం అంటూ ఉం డదు. వీటిని ముందుగానే అంచనా వేసుకోవాలి.
వైద్యుల సంఖ్య తక్కువ!
భారత్లో జనాభా నిష్పత్తికి సరిపడా వైద్యులు లేరు. సుమారు 20 లక్షల మంది వైద్యులు తక్కువగా ఉన్నారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెస్తున్నామని ప్రధానమంత్రి మోదీ ప్రకటించడం విప్లవాత్మకమైన నిర్ణయమే.
కానీ మొత్తం 75 వేల సీట్లూ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీట్లతో పాటు ఫీజులూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండాలి. 500 పడకల కంటే ఎక్కువ ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వైద్యకళాశాల మంజూరు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. ఫీజులు, విద్యార్థుల ప్రవేశాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే వైద్యరం గంలో అనూహ్యమైన మార్పొలొస్తాయి.
అరుదైన రికార్డు!
నేను యూకే, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లోని అనేక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో మెడికల్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను . యేటా అమెరికా వెళ్లి అక్కడి వైద్య మెడికల్ విద్యార్థులు, వైద్యులకు అత్యాధునిక చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తాను. విదేశీ యూనివర్సిటీ యాజమాన్యాలు మెడిసిన్ చదువుతున్న విద్యార్థులను కోర్సులో భాగంగా ఏడాదిలో నాలుగు నుంచి ఆరువారాల పాటు ప్రత్యేక తరగతులు,
శిక్షణ నిమిత్తం నా దగ్గరకు పంపిస్తారు. నేను వీవీఐపీలకు వైద్య సేవలు అందిస్తున్నాను. వీరిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. కొవిడ్ సమయంలో నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ విద్యార్థుల కోసం 150 ఆన్లైన్ తరగతులు చెప్పాను. అది నేషనల్ రికార్డు. ప్రపంచంలోనే చాలా అరుదు.